కోలీవుడ్ లో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా… అందులో జయలలితకు సంబంధించిన ఒక బయోపిక్ లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. “తలైవీ” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జయలలిత పాత్రలో ఒదిగిపోయేందుకు కంగనా భారీగా బరువు పెరుగుతుందట. అంతేకాదు తమిళం కూడా నేర్చుకుంటుందట. తమిళం నేర్చుకోవడం చాలా కష్టమైనప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. డైలాగులు చిత్రంలో కీలకం కానుండగా, పలు డైలాగులని కంఠస్తం చేస్తున్నాను. ఎప్పటి నుండో తమిళం నేర్చుకోవాలని అనుకున్నాను. ఈ చిత్రం ద్వారా అది నెరవేరింది అని కంగనా పేర్కొంది. దక్షిణాది భాషలలో పాటు హిందీలోను విడుదల కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించనున్నారు.