తనను ఆదరిస్తున్న తమిళ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రానున్నానని నటి శ్రీరెడ్డి అన్నారు. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాతో మాట్లాడిన ఆమె గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్న ప్రయత్నాల్లో తానున్నానని తెలిపారు. ఇటీవలి కాలంలో తన పేరిట సోషల్ మీడియాలో తప్పుడు ఖాతాలు తెరిచారని, వాటిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. చాలా మంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై తాను బహిరంగంగా నిజాలను చెప్పినా, తనకు ఎవరి నుంచీ మద్దతు లభించలేదని శ్రీరెడ్డి వాపోయారు. తమిళ నటుడు ఉదయనిధిపై ఆరోపణలు చేస్తూ, తాను ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఉదయనిధిని తాను ఎన్నడూ నేరుగా కలవలేదని స్పష్టం చేశారు. ఎవరో నకిలీ ఖాతాను సృష్టించి, పనిగట్టుకుని తన పేరిట ఉదయనిధిపై ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. ఉదయనిధి పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారని, వారి సంగతి పోలీసులే చూసుకుంటారని అన్నారు.