బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ, దిల్జీత్ దోసాంజే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుడ్ న్యూస్’. రాజ్ మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్తో కలిసి అపూర్వ మెహతా, హీర్ జోహార్, శశాంక్ ఖైతాన్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది.ఇందులో అక్షయ్ కుమార్(వరుణ్ బాత్రా), కరీనా కపూర్(దీప్తి బాత్రాగా)లు భార్య భర్తలుగా నటిస్తున్నారు. వీరికి పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో డాక్టర్ను కలువగా ఐవీఎప్ పద్దతి ద్వారా పిల్లలను కనొచ్చని సలహా ఇస్తాడు. అదే సమయంలో కియారా(మోనికా బాత్రా), దిల్జీత్( హనీ బాత్రా) మరో జంట ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని అదే హాస్పటిల్కు వస్తారు. అయితే, వీరి పేర్ల చివర్లో బాత్రా అని కామన్గా ఉండటంతో డాక్టర్లు కన్ఫ్యూజ్ లో వీరిద్దరి నుంచి సేకరించిన వీర్యాన్ని ఒకరికి బదులు మరొకరి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను కామెడీ జోడించి తెరకెక్కించారు. దీంతో ఈ ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది. ఇక, ఈ సినిమాను డిసెంబర్ 27న విడుదల చేస్తున్నారు.