రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్తో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్తోనే కావాల్సినంత ప్రచారాన్ని రూపాయి ఖర్చు లేకుండా పొందాడు వర్మ. మరోవైపు ఈ సినిమాకు సంబందించి పూటకో పోస్టర్, లేదా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ.. అంచనాలు బాగానే పెంచాడు. కాగా గతంలో ఈ సినిమాకు సంబందించి ఓ ట్రైలర్ విడుదల చేసిన వర్మ తాజాగా మరో ట్రైలర్ను విడుదల చేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ పోస్టర్లో వర్మ పప్పులాంటి అబ్బాయి, అతని తండ్రి ఆటో నడుపుతున్నట్లు చూపించగా.. ట్రైలర్లో మాత్రం దానికి సంబందించి ఏమి చూపించలేదు. ఇక ఈ ట్రైలర్లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా చేసుకుని ఈ తాజా ట్రైలర్లో చూపించినట్లు కనబడుతోంది. కాగా ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తుండగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు . ఇక ఈ సినిమాను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ.