దంగల్' నటి జైరా వాసిమ్ ఇటీవల ఢిల్లీ నుండి ముంబై ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వల్ల తీవ్ర ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో వెల్లడించడంతో ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు.జైరా వాసిమ్ కు ఎదురైన సంఘటనపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. జైరా వాసిమ్ తనకు జరిగిన దారుణాన్ని బయటికి చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఇందులో జైరా వాసిమ్ తప్పు ఉందని వాదిస్తున్న వారిపై కంగనా మండిపడింది. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించింది.ఆమె స్థానంలో నేను ఉంటే వేధించిన వాడి కాళ్లు అక్కడే విరగొట్టేదాన్ని అన్ని కంగనా రనౌత్ తనదైన రీతిలో స్పందించారు. ఇలాంటి వ్యక్తులను ఊరికే వదిలిపెట్టకూడదని, తగిన బుద్ది చెప్పినపుడే మళ్లీ పునరావృతం కావు అని అన్నారు.ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రుల దృక్పధం, సమాజం ఆలోచించే తీరు మారాలని కంగనా అన్నారు. అలాంటి డ్రెస్సు వేసుకోవద్దని, ఫలానా సమయంలో బయటికి వెళ్లకూడదని ఆడపిల్లలకు ఎందుకు చెబుతున్నారని కంగనా ప్రశ్నించింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇటువంటివే చెబుతుంటారని.... ముందు ఈ విషయంలో మార్పు రావాలన్నారు.ఆడపిల్లలు వేసుకునే దుస్తులు, చేసే పనులే ఇలాంటి లైంగిక దాడులకు కారణం అవుతున్నాయనే వాదనను కంగనా తప్పుబట్టింది. తప్పుడు ఆలోచనలు చేసే వ్యక్తుల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఆమె తెలిపారు.