హైదరాబాద్: టాలీవుడ్లో ఒకప్పుడు క్రేజీ హీరోగా వెలుగొందిన వరుణ్ సందేశ్కు సంబంధించిన వార్త ఒకటి మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వరుణ్ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లున్న ఫొటోలు కూడా సర్క్యులేట్ అయ్యాయి. గత ఏడాది ఆగస్టులో వరుణ్-వితికల వివాహం జరిగింది. కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు.
కాగా, తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్నవార్తలను వితిక ఖండించారు. ‘అవన్నీ ఫేక్ న్యూస్. మేం సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దు’ అని వితిక ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడతానని ఆమె చెప్పారు. ‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో వరుణ్-వితిక జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ.. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వివాహ బంధంగా మారింది.