ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్య‌ప్ప‌దీక్షల‌ను భగ్నం చేయొద్దు: యేసుదాసు

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2019, 09:18 AM



శతాబ్దాలుగా కొనసాగుతున్న శబరిమల ఆలయం వివాదంలో సంప్రదాయానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఉందని అయ్యప్ప భక్తులు నిరసనలు, ఆందోళనలు తెలిపారు. అయితే, సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు కావడం.. దానిని విస్తృత ధర్మసనానికి బదిలీ చేయడంతో ఈ ఏడాది మాత్రం మహిళలను ఆలయంలోకి అనుమతించబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ నేపథ్యంలో శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ప్రముఖ గాయకుడు, అయ్యప్ప భక్తుడు కేజే ఏసుదాసు స్పందించారు. చెన్నైలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని ఎంతో వినమ్రతతో కోరుకుంటున్నానని అన్నారు. అంతేకాదు, ఒకప్పుడు అయ్యప్పస్వామి మాలధారణ చేసిన భక్తులు వారి ఇంట్లోని మహిళలనూ చూసేవారు కాదన్నారు. ఇప్పుడు కాలం మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా అమ్మాయి శబరిమలకు వెళ్తే దీక్షలో ఉన్న భక్తులు చూస్తారని, ఇది వారి మనసులో చెడు భావనను కలిగిస్తుందన్నారు. అందుకే శబరిమలకు వెళ్లొద్దని మహిళలను వేడుకుంటున్నానని ఏసుదాసు అన్నారు.


మహిళలు వెళ్లడానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయని, వారు అక్కడికి వెళ్లొచ్చని, అయ్యప్ప భక్తుల దీక్షను భగ్నం చేయొద్దు అని ఏసుదాసు కోరారు.కాగా, శబరిమల ఆలయంలోకి పోలీసుల భద్రతో మహిళలను సురక్షితంగా పంపేలా కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇది చాలా సున్నితమైందని, భావోద్వేగంతో కూడుకున్నదని, పరిస్థితి హింసాత్మకంగా మారడానికి తాము సమ్మతించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు చర్యలు చేపడతామని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com