ఓ పక్క కథానాయికగా రాణిస్తూ నిర్మాతగానూ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరి’. ప్రోసిత్ రాయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్ను అనుష్క ట్విటర్లో విడుదల చేసింది.
టీజర్లో బాధగా చూస్తున్న అనుష్క ముఖం ఒక్కసారిగా అంతా రక్తపుమరకలతో భయంకరంగా మారడం సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఇలాంటి పాత్రలో అనుష్క నటించడం ఇదే తొలిసారి. అనుష్క టీజర్ను పోస్ట్ చేస్తూ ‘స్వీట్ డ్రీమ్స్ గాయ్స్’ అని ట్వీట్ చేసింది.
క్లీన్ స్లేట్ ఫిలింస్ బ్యానర్పై ఈ సినిమాను అనుష్క నిర్మిస్తోంది. ‘ఎన్హెచ్ 10’, ‘ఫిల్లౌరీ’ సినిమాల తరువాత అనుష్క నిర్మిస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో అనుష్కతో పాటు రీటాభరీ చక్రవర్తి, పరంబాత్రా చట్టర్జీ, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హోలీ సందర్భంగా మార్చ్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతో పాటు అనుష్క షారుక్కి జోడీగా ‘జీరో’, వరుణ్ ధావన్కి జోడీగా ‘సూయీ ధాగా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహమయ్యాక అనుష్క సినిమాల నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. ఆదివారం కేప్టౌన్ నుంచి ముంబయి చేరుకున్నాక సోమవారం నుంచి ఆమె షూటంగ్లో పాల్గొంటోంది.