ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ 2 షూటింగ్‌ క్రేన్ ప్రమాదం పై దర్శకుడు శంకర్ భావోద్వేగమైన పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 06:41 PM



కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలింది . ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్శకుడు, నిర్మాత, హీరోలకు నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు ఈ కేసును తమిళనాడు ప్రభుత్వం సీఐడీని అప్పగించింది. ఇక ఈ దుర్ఘటనపై పలువురు స్పందించి తమ సానుభూతిని కూడా ప్రకటించారు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి దర్శకుడు శంకర్ దీనిపై స్పందించలేదు. దీంతో శంకర్ ఎక్కడున్నారు..? ఈ ప్రమాదంలో శంకర్‌ కూడా గాయపడ్డారు..? ఆయన ఎందుకు ఈ ఘటనపై స్పందించలేదు..? అన్న ప్రశ్నలు అందరిలో మెదిలాయి. ఆ ప్రశ్నలన్నింటికి తాజాగా సమాధానం చెప్పేశారు శంకర్.


సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేసిన శంకర్.. ‘‘చాలా బాధతప్తమైన హృదయంతో ఈ ట్వీట్‌ను చేస్తున్నా. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి నేను షాక్‌లో ఉండిపోయా. నా అసిస్టెంట్ డైరక్టర్, మూవీ యూనిట్ మరణంతో నిద్రలేని రాత్రులు గడిపా. ఈ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నా. ఆ క్రేన్ నా మీద పడినా బావుండేదేమో. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని అన్నారు. కాగా ఆ ప్రదేశం నుంచి కొన్ని నిమిషాల ముందే వెళ్లిపోయిన కమల్ హాసన్, కాజల్ అగర్వాల్.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.కోటి రూపాయల నష్టపరిహారం అందించేందుకు కమల్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com