కొంచెం గ్యాప్ తర్వాత టాలీవుడ్లో ఆన్ లైన్ యుద్ధాలకు మళ్లీ తెరలేచింది. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. లాంటి హీరోల సినిమాలు వచ్చాయంటే చాలు.. సోషల్ మీడియా వేడెక్కిపోతుంది. ఎవరికి వాళ్లు రికార్డుల ప్రస్తావన తెచ్చి గొప్పలు పోవడం.. అవతలి హీరోలను.. వారి అభిమానుల్ని ఎగతాళి చేయడం.. ఈ క్రమంలో కింది స్థాయికి దిగజారి పోవడం.. ఒకరినొకరు బూతులు తిట్టేసుకోవడం గత కొన్నేళ్లలో బాగా పెరిగిపోయింది. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే దాని ఫలితాన్ని బట్టి పరస్సరం ట్రోలింగ్స్ మొదలవుతాయి. గతంలో కోలీవుడ్ వరకే ఈ విష సంస్కృతి ఉండేది. ఈ మధ్య తెలుగు హీరోల అభిమానులు కూడా ఈ విషయంలో ముదిరిపోయారు.
పవన్ కళ్యాణ్-మహేష్ బాబు అభిమానుల మధ్య గత కొన్నేళ్లుగా ఆన్ లైన్ ముష్టి యుద్ధాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. పవన్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ అయినపుడు మహేష్ అభిమానులు ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ వచ్చి ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలవడంతో పవన్ అభిమానులు రెచ్చిపోయారు. అంతకుముందు ఏ హీరో మీదా లేని స్థాయిలో ట్రోలింగ్ చేశారు. అవి పెద్ద వివాదానికి కూడా దారి తీశాయి. ఒక పత్రికలో దీని గురించి ఓ కథనం రావడం కలకలం రేపి.. అది రాసిన వ్యక్తి ఉద్యోగమే పోయేలా చేసింది. ఆ సంగతలా వదిలేస్తే.. ఈ ఏడాది ఆరంభంలో ‘కాటమరాయుడు’ బోల్తా కొట్టినపుడు మళ్లీ మహేష్ అభిమానుల వంతు వచ్చింది. తర్వాత ‘స్పైడర్’ తుస్సుమనగానే వాళ్లు రెచ్చిపోయారు. మహేష్ ను దారుణమైన రీతిలో ట్రోల్ చేశారు. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు ఛాన్స్ వచ్చింది. ‘అజ్ఞాతవాసి’కి నెగెటివ్ టాక్ రావడంతో వాళ్లు విజృంభిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఎన్ని వందల మీమ్స్ తయారయ్యాయో. పవన్ తో పాటుగా త్రివిక్రమ్ ను కూడా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఈ రోజు కూడా ట్రోలింగ్ ఉద్ధృతంగా సాగుతోంది. ఐతే ఈ సినిమా విడుదలకు ముందు రికార్డులు కొట్టబోతున్నామంటూ మహేష్ అభిమానుల్ని పవన్ ఫ్యాన్స్ బాగా కవ్వించిన మాట కూడా వాస్తవం. దీంతో వాళ్లు మరింతగా రెచ్చిపోయి ‘స్పైడర్’ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ పవన్.. పవన్ అభిమానుల్ని టార్గెట్ చేశారు.