పూరీ జగన్నాథ్, నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన `సూపర్` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ అనుష్క. ఆ సినిమా తర్వాత ఆమె చేసిన కొన్ని సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. అయితే ఒక్క సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. దక్షిణాదిన అనుష్కను టాప్ హీరోయిన్గా నిలబెట్టింది. ఆ సినిమాయే శ్యామ్ప్రసాద్ రెడ్డి నిర్మించిన `అరుంధతి`. ఆ సినిమాతో జేజమ్మగా మారిన అనుష్క ఇప్పుడు `బాహుబలి`తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పూరీ జగన్నాథ్ల గురించి అనుష్క మాట్లాడింది. `నిర్మాత శ్యామ్ప్రసాద్ రెడ్డి లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కచ్చితంగా ఆయనే కారణం. `అరుంధతి` సినిమాకు నన్ను ఎంచుకోబట్టే ఇప్పుడు భారీ సినిమాలు చేయగలుగుతున్నాను. ఇక, నా మొదటి సినిమా టైమ్లో నాకసలు సినిమాల గురించి ఏమీ తెలియదు. సినిమాకు ఓకే చెప్పేముందు స్క్రిప్టు వినాలో, లేదో కూడా తెలియదు. నాకు చాలా విషయాలు డైరెక్టర్ పూరీ జగన్నాథ్గారే నేర్పించార`ని అనుష్క చెప్పింది.