ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్దు సీన్లు ఉన్నాయని ‘అర్జున్‌రెడ్డి’ని వద్దన్నా

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 11:05 AM



తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన కథానాయిక పార్వతి నాయర్‌. ప్రస్తుతం ఆమె పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా, రెండు సూపర్‌హిట్స్‌ను వదులుకుని, చాలా బాధపడ్డానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగులో తీసిన ‘అర్జున్‌రెడ్డి’, తమిళ చిత్రం ‘అరువి’కి తన డేట్స్‌ అడిగినట్లు తెలిపారు.


 


‘‘దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నన్ను కలిసి కథ చెప్పారు. శ్రుతిమించిన సన్నివేశాలు ఉండటంతో అందులో నటించడానికి ఇబ్బందిగా ఫీలయ్యా.. ముద్దు సన్నివేశాలు చాలా ఉన్నాయి. హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు కొత్త వ్యక్తులని అభిప్రాయపడ్డా. అందులోనూ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నాకు ఇబ్బందిగా అనిపించాయి. నేను ఈ సినిమా కథ చదివినప్పుడు చాలా సామాన్యంగా ఉంది. కానీ, అప్పుడు ఓ నూతన దర్శకుడి నైపుణ్యాన్ని గుర్తించలేకపోయా. అందుకే నేను ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను చూసినప్పుడు మిస్‌ అయ్యానే అని చాలా బాధపడ్డా. ఓ సాధారణ ప్రేమకథను ప్రభావంతంగా, భావోద్వేగాలతో తెరకెక్కించిన ఘనత సందీప్‌రెడ్డిది. ఆయన సినిమాను తీర్చిదిద్దిన తీరు నాకు చాలా నచ్చింది’’.


‘‘అరువి’ సినిమా కోసం 2015 ఫిబ్రవరిలో నన్ను సంప్రదించారు. కథలో భాగంగా నేను గుండు చేయించుకోవాలని చెప్పారు. దీంతో వద్దు అనుకున్నా.. కానీ సినిమాలో అలాంటి సన్నివేశాలే లేవు. కథానాయిక వెంట్రుకలు ట్రిమ్‌ చేశారంతే, పూర్తిగా తీసేయలేదు. ఈ సినిమాను చూశా, చాలా బాగుంది. దీన్ని కూడా మిస్‌ అయ్యానే అనుకున్నా. ఈ సినిమాలో నటించే అవకాశం వదులుకున్నందుకు రెండు వారాలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ‘అర్జున్‌రెడ్డి’ని మిస్సైనందుకు‌ నెలరోజులు బాధపడ్డా. ఇలాంటి సినిమాల్లో నటించాలని ప్రతి నటి కోరుకుంటుంది. కానీ ఆ అవకాశాన్ని నేను చేతులారా వదులుకున్నా’’ అని ఆమె చెప్పారు.


విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తెలుగులో సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. తమిళ నటి అదితి బాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరువి’. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తనను కంటతడి పెట్టించిందని రజనీకాంత్‌ అన్నారు. ‘ఈ సినిమా నన్ను నవ్వించింది. ఏడిపించింది. జీవితంలోని అనేక అంశాల గురించి ఆలోచింపజేసింది. ప్రేక్షకులు కొన్నేళ్ల పాటు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు’ అంటూ ఆయన చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శించారు. ఓ యువతి తనకు నచ్చినట్లు జీవించాలి అనుకుంటుంది.. కానీ దానికి సమాజం ఒప్పుకోదు. అప్పుడు ఆ యువతి ఏం చేసింది? అనే కథాంశంతో సోషియో, పొలిటికల్‌ డ్రామాగా దర్శకుడు అరుణ్‌ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం అడవి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రంలో పార్వతి నాయర్‌ కథానాయికగా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com