చిత్రం: వైశాఖం
నటీనటులు: హరీశ్.. అవంతిక మిశ్రా.. సాయికుమార్.. కాశీవిశ్వనాథ్.. పృథ్వీ తదితరులు
ఛాయాగ్రహణం: వెంకట సుబ్బారావు
సంగీతం: డీజే వసంత్
నిర్మాణం: బి.ఎ.రాజు
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: బి. జయ
విడుదల తేదీ: 21-07-2017
దర్శకురాలిగా అభిరుచి గల చిత్రాలను తెరకెక్కిస్తున్నారు బి.జయ. గతంలో ఆది కథానాయకుడిగా ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘లవ్లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అటు కుటుంబ ప్రేక్షకులను, ఇటు యువ హృదయాలను ఆకట్టుకుంది. తాజాగా సరికొత్త ప్రేమకథ అంటూ ఆమె ‘వైశాఖం’ చిత్రాన్ని తెరకెక్కించారు. కొత్తవారైన హరీశ్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘లవ్లీ’తో తనదైన ముద్ర వేసిన జయ ‘వైశాఖం’తో మరోసారి ఆకట్టుకున్నారా? నూతన నటీనటులైన హరీశ్, అవంతికలు ఏ మేరకు మెప్పించారు? దర్శకురాలు చెప్పినట్టు నిజ జీవితాలకు ఈ చిత్రం దగ్గరగా ఉందా?
కథేంటంటే?: హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో వేణు(హరీశ్) అనే కుర్రాడు ఉంటాడు. తన అవసరాల కోసం అపార్ట్మెంట్లోని మిగిలిన వారిని వాడుకొంటుంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్లోకి భాను(అవంతిక) అనే అమ్మాయి దిగుతుంది. వేణు గర్ల్ఫ్రెండ్ని అని అబద్ధం చెప్పి ఫ్లాట్ తీసుకుని ఓ బ్యూటీపార్లర్ నడుపుతుంటుంది. విషయం తెలుసుకున్న వేణు.. పరువుపోతుందని, ప్రేమికుడిగా నటించేందుకు భానుతో ఓ ఒప్పందం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య చిగురించిన స్నేహం.. ప్రేమగా మారుతుంది. అయితే ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. మనస్పర్థలు రావడంతో చివరకు విడిపోతారు. అలాంటి పరిస్థితుల్లో భాను ఆ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లిపోయిందా? అసలు భాను అక్కడికే ఎందుకు వచ్చింది? చివరకు వీరి కథ ఏమైంది? వీరి ప్రేమ మిగతా వారిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అనేదే ‘వైశాఖం’.
ఎలా ఉందంటే: ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్ల సంస్కృతి ఎలా ఉంటుందనే దానిపై తీసిన సినిమా ఇది. కావడానికి ప్రేమకథే అయినా నిజజీవితానికి దగ్గరగా భావోద్వేగాలపై రాసుకొన్న కథ ఇది. టామ్ అండ్ జెర్రీలాంటి రెండు పాత్రలు.. వారి మధ్య స్నేహం.. ప్రేమ.. గొడవలు.. విడిపోవడం వీటి మధ్య కథ సాగుతూ ఉంటుంది. అపార్ట్మెంట్ అంటే ఓ మినీ భారతం అనే కాన్సెప్ట్ను ‘వైశాఖం’లో చూపించారు. ప్రథమార్ధం అంతా సరదా సన్నివేశాలతో సాగుతుంది. నాయకనాయికల గొడవలు, పంతాలతో నడిచించింది. ద్వితీయార్ధం భావోద్వేగ సన్నివేశాలతో నడిపించారు దర్శకురాలు. ముఖ్యంగా కథానాయకుడు-అతని తల్లి మధ్య వచ్చే సన్నివేశాలు, హీరో ఫ్లాష్బ్యాక్, సాయికుమార్ పాత్ర ద్వితీయార్ధాన్ని నడిపిస్తాయి. సాయికుమార్ పాత్ర ఈ కథకు మూలం. ‘మనది అనుకోవడమే గొప్ప భావన’ అనే చిన్న సందేశం ఇచ్చి కథను ముగించారు దర్శకురాలు.
ఎవరెలా నటించారంటే: తెరపై నాయకనాయికల జోడీ బాగుంది. సరదా, భావోద్వేగ సన్నివేశాల్లో హరీశ్ నటన బాగుంది. కథానాయికగా అవంతిక సైతం ఆకట్టుకుంది. సాయికుమార్ది చిన్న పాత్రే అయినా కథలో అదే కీలకం. పృథ్వీ, భద్రం, కాశీవిశ్వనాథ్ వాళ్ల పరిధి మేర నటించారు. సాంకేతికంగా పాటలు బాగున్నాయి. కంట్రీ చిలుకా.. ప్రార్థిస్తా నచ్చుతాయి. ‘వైశాఖం’ టైటిల్ సాంగ్ కథానుగుణంగా సాగుతుంది. దర్శకులు ఎంచుకున్నది చిన్న పాయింటే అయినా బలమైన సన్నివేశాలు, పాత్రలు ఉన్నప్పుడే అది విజయం సాధిస్తుంది. ఈ విషయంలో దర్శకురాలు మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. పతాక సన్నివేశాలు వచ్చే వరకూ కథాగమనంపై ప్రేక్షకుడికి అనుమానాలు వస్తూనే ఉంటాయి. అసలు కథ ఇలా ఎందుకు జరుగుతోందో తెలియాలంటే క్లైమాక్స్ వరకూ వేచి చూడాలి. హీరో-హీరోయిన్ల లవ్ట్రాక్పై మరింత దృష్టి పెడితే బాగుండేది.
బలాలు
స్టోరీ పాయింట్
పాటలు
భావోద్వేగ సన్నివేశాలు
బలహీనతలు
ద్వితీయార్ధం