హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్వర్మ జీఎస్టీ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) వివాదంతో పాటు చర్చలలో మహిళలని అగౌరవపరుస్తూ కొన్నివివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత నెల 25న సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ముంబైలో ఉన్న వర్మకి నోటీసులు పంపారు. అయితే షూటింగ్ బిజీలో ఉన్న తాను విచారణకి హాజరు కాలేనని, మరో సారి నోటీసులు పంపితే తప్పక హాజరు అవుతానని వర్మ తన లాయర్ ద్వారా కోర్టుకి తెలియజేశారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ అధికారులు మరోసారి వర్మకి నోటీసులు పంపారు. వీటిని అందుకున్న వర్మ ఈ రోజు విచారణకి హాజరు అవుతానంటూ సమాచారం అందించినట్టు తెలుస్తుంది. వర్మ చేసిన వ్యాఖ్యలపై ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.