ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని ప్రముఖనటుడు బ్రహ్మానందం సందర్శించారు. హనుమంతరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హనుమంతరావు కుటుంబానికి ఆయన ప్రగాడ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హనుమంతరావు గొప్పతనాన్నివివరించారు. హనుమంతరావు నీతినియమాలు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. హనుమంతరావు గురించి చెబుతూ బ్రహ్మానందం కన్నీటిపర్యంతమయ్యారు.
‘హనుమంతరావు మరణించారనే వార్త వినగానే అలజడి, వణుకు వచ్చింది. వెంటనే ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజాకు మూడు సార్లు ఫోన్ చేసి.. హనుమంతరావు మృతి చెందిన విషయాన్ని నిర్థారించుకున్నాను. తర్వాత హనుమంతరావు తమ్ముడు నాకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని నటుడు హనుమంతరావు. హనుమంతరావును చూసి ఇప్పుడు సినీ ఇండ్రస్టీలోకి వస్తున్న కొత్తతరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తనకు సినిమాల్లో వేషాలు తగ్గినప్పుడు నిర్మాతకు కానీ.. దర్శకుడికి కానీ వేషం ఇప్పించాలని హనుమంతరావు అడిగిన సందర్భాలు లేవు. హనుమంతరావు ఆశయాలు ఉన్న గొప్ప నటుడు. తనకుంటూ ఓ శైలిని, ప్రత్యేకతను చాటుకునేవాడు. నాకు ఉన్న అతి తక్కువ మంది మిత్రుల్లో హనుమంతరావు ఒకరు’’ అని బ్రహ్మానందం కన్నీటి పర్యంతమయ్యారు.