‘అర్జున్రెడ్డి’తో భారీ గుర్తింపు సొంతం చేసుకున్న నటి షాలినిపాండే. ఈ అమ్మడుకు ఇప్పుడు తెలుగు, తమిళంలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో జీవీ ప్రకాశ్ సరసన ‘100% కాదల్’, జీవాతో ‘గొరిల్లా’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. దీనిగురించి షాలిని పాండే మాట్లాడుతూ ‘అర్జున్రెడ్డి’లోని ప్రీతి పాత్ర నన్ను చాలా మంది ప్రేక్షకులకు సుపరిచితురాలిని చేసింది. పలు సినిమాల క్రేజీని ఆ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు ‘ప్రీతి’ అనే పిలుస్తున్నారు. ఆ పిలుపు నాలో మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్రజల ప్రేమ, అభిమానం ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసింది. అయినప్పటికీ ఆ సినిమా ద్వారా వచ్చిన విజయం, పేరు ప్రఖ్యాతలను తలకెక్కించుకోను. నేను ఎప్పటిలాగే ఉన్నా. తెలుగులో లాగే తమిళంలోను ప్రేక్షకుల మన్ననలు అందుకుంటా. ‘100% కాదల్’, ‘గొరిల్లా’ చిత్రాలతో అది సాధ్యమవుతుందని నమ్ముతున్నా. మరికొన్ని చిత్రాల్లో కూడా నటించడానికి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను కూడా వెల్లడిస్తానని పేర్కొన్నారు.