కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో అడివి శేషు తాజా చిత్రం "మేజర్". 2008లో ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కమాండర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మేజర్ చిత్రం తెరకెక్కుతుంది. శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి అడవి శేషుతో 'మేజర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మహేష్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు. ఈ సినిమాలో 'దబాంగ్-3' బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈమె ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె. ఇక 'గూఢచారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికి 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. 2021 వేసవిలో ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.