గత కొంతకాలంగా ఏదోఒక సినిమాలో మెరుస్తూ వచ్చిన సీరత్కపూర్కు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లడమే కాదు ఓ అవకాశం వచ్చినట్లు వచ్చి చేజారిందని పరిశ్రమలో అంటున్నారు. రన్ రాజా రన్ వంటి హిట్ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ భామకు ఆ తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. టైగర్, కొలంబస్ వంటి సినిమాలు ఆమెకు విజయాన్ని అందించలేకపోయాయి. అయితే నాగార్జున, సమంతలు నటించిన రాజుగారి గది-2, అల్లు శిరీష్ నటించిన ఒక్కక్షణం చిత్రాలు ప్రేక్షకాదరణకు నోచుకోవడంతో పాటు సీరత్కు కూడా అంతోఇంతో పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య వచ్చిన రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం చెందడంతో పాటు సీరత్ ఆశలను నీరుగార్చింది.
ఈ నేపథ్యంలో సీరత్ చేతిలో సినిమాలున్నట్లు కనిపించడం లేదు. పైపెచ్చు ఇప్పటికే వచ్చిన అవకాశం కాస్తా చేజారిపోయిందని వినిపిస్తోంది. రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయమవుతూ బృందావనమది అందరికి అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో సిద్ధు, విక్రమ్ వంటి హీరోలు నటించనుండగా, సీరత్ను కథానాయికగా అనుకున్నారు. కుటుంబ కథాచిత్రంగా రూపొందించబోయే ఈ చిత్రంలో తెలుగింటి ఆడపడుచులాంటి అమ్మాయి అయితే బావుంటుందని చిత్రబృందం భావించారట. ఆ మేరకు సీరత్కు బదులుగా రిచాపనయ్ని ఎంపిక చేశారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అయితే చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.