శక్తిమాన్ టీవీ సీరియల్ తో దేశవ్యాపంగా గుర్తింపు పొందిన నటుడు ముఖేశ్ ఖన్నాపై ప్రముఖ దక్షిణాది నటి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ముఖేశ్ ఖన్నా మీటూ ఉద్యమంపై వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశంలో తాము పురుషులతో సమానం అని మహిళలు భావించడం వల్లే మీటూ ఉద్యమం తయారైందని ముఖేశ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. మహిళలు ఇంటిని చక్కదిద్దుకుంటే చాలు అని వ్యాఖ్యానించారు.
దీనిపై రాధిక స్పందిస్తూ, ఈ మతిలేని మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలకు దూరంగా ఉండడమే మేలు అని అభిప్రాయపడ్డారు. కొందరు మూర్ఖత్వంతోనే ఇలా మాట్లాడతారని మండిపడ్డారు.
అంతకుముందు, ముఖేశ్ వ్యాఖ్యలపై గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా విరుచుకుపడ్డారు. కొందరి మానసిక పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు.