సుధీర్బాబు, అదితిరావు జంటగా నటిస్తున్న చిత్రానికి సమ్మోహనం అనే పేరు ఖరారు చేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత.
దర్శకుడు మాట్లాడుతూ సమ్మోహనం అంటే మంత్రముగ్దులను చేసే ఒక అందమైన ఆకర్షణ. మా చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య సమ్మోహనకరమైన రొమాన్స్ ఉండటంతో పాటు మిగతా పాత్రలకి ఉండే విభిన్నమైన ఆకర్షణలు మెప్పిస్తాయి. ఓ కొత్త పోకడ ఉన్న నవతరం ప్రేమకథా చిత్రంగా ఉంటూనే అద్యంతం హాస్యం, సజీవమైన కుటుంబ బంధాలు, ఉద్వేగ భరిత సన్నివేశాల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజా షెడ్యూల్ మార్చి 3 వరకు జరుగుతుంది. ఆ తర్వాత జరిగే షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్, ముంబైలో చిత్రీకరిస్తాం. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మే మూడవ వారంలో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు. ఇతర పాత్రల్లో నరేష్, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్, కాదంబరి కిరణ్, హరితేజ నటిస్తున్నారు. ఛాయాగ్రహణం పి.జి.విందా.