ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ (80) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో మృతి చెందారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరేంద్ర చంచల్ దాదాపు మూడు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మృతి చెందారు. నరేంద్ర చంచల్ను భజన్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
కేవలం భజన పాటలే.. కాదు సినిమా పాటలను కూడా భజన్ చంచల్ ఆలపించారు. చంచల్ ఎన్నో హిందీసినిమాల్లో పాటలు పాడారు. కేవలం పంజాబ్ మాత్రమే కాదు.. భజన పాటలకు ఉత్తరాదిన ఎంతో క్రేజ్ ఉంది. ఇకపోతే నరేంద్ర చంచల్ స్వస్థల పంజాబ్లోని అమృత్సర్ జిల్లా నమక్ మండి. 1840, అక్టోబరు 16న పంజాబీ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. వారిది ఆధ్యాత్మిక కుటుంబం కావడం వల్ల చిన్నప్పటి నుంచే భజన పాటలు ఆలపించే వారు.
1973లో వచ్చిన బాబీ మూవీలో 'బేషక్ మందిర్ మసీద్' పాటను నరేంద్ర చంచల్ ఆలపించారు. ఆ పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు దక్కింది. నరేంద్ర చంచల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహిందీ కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.