భారత్ లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పతాక స్థాయికి చేరింది. నిత్యం 4 లక్షల కేసులు 3 వేల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఆక్సీజన్ దొరక్కనే చాలా మంది చనిపోతున్నారు. ఇక రెమ్ డెసివర్ వంటి మందుల కొరత కూడా వేధిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో భారతీయులకు సహాయం చేసేందుకు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ముందుకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీలో ఆక్సీజన్ ప్లాంట్ తోపాటు 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించారు ఖురేషీ. హాలీవుడ్ దర్శకుడు జాక్ స్నైడర్ తో కలిసి తాత్కాలిక ఆసుపత్రి సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం సేవ్ ది చిల్డ్రన్ సంస్థతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు ఖురేషీ. ఈ రెండు పనులే కాకుండా.. ఇంకా పలు సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. రోగులకు ఇంట్లోనే చికిత్స అందించడానికి వీలుగా కొవిడ్ స్పెషల్ కిట్స్ అందిస్తామని కూడా తెలిపారు. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు.. వైద్యం అందక జనం పడుతున్న వేదన చూస్తే హృదయం ద్రవిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.