భారతీయ సినీ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు స్పార్క్ ఓటీటీ పేరిట సరికొత్త వేదిక రంగంలోకి దిగనుంది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న యువ ఔత్సహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ఆధ్వర్యంలోని ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నూతన ఓటీటీని ప్రారంభించనుంది. తెలుగుతో పాటు తమిళం కన్నడ మళయాళం మరియు హిందీ భాషల్లో కార్యక్రమాలను ప్రసారం చేయనున్న స్పార్క్ ఓటీటీ నవతరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కథనాలతో సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన సినిమాలు వరుసగా స్పార్క్ ఓటీటీలో విడుదల కానున్నాయి. ఇందుకోసం స్పార్క్ ఓటీటీలో రాంగోపాల్ వర్మ ఓ థియేటర్ నే అద్దెకు తీసుకున్నారు. ఈ థియేటర్ లో వర్మ నిర్మించిన డీ కంపెనీ డేంజరస్ దిశా ఎన్కౌంటర్ తదితర చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయి. ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత సాగర్ మాచనూరు మాట్లాడుతూ అన్ని రకాల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటిదాకా ఏ ఒక్కరు స్పృశించని కథనాలతో వరుస సిరీస్ లను సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.