అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమాను రూపొందించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అయితే సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. పుష్ప సినిమా ను రెండు పార్ట్ లు గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా హీరోయిన్ విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో కృతి సనన్ ను ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపాడనే వార్తలు మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. 2014 లో మహేష్ బాబుతో సుకుమార్ తెరకెక్కించిన '1 నేనొక్కడినే' సినిమాలో కృతి సనన్ నటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత టాలీవుడ్ లో దోచెయ్ సినిమాలో నటించింది. రెండు సినిమాలు నిరాశ పర్చడంతో గత అయిదు ఆరు సంవత్సరాలుగా పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.
ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న ఆదిపురుష్ సినిమా లో కృతి సనన్ నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత రాబోతున్న కృతి సనన్ ఆ తర్వాత కూడా వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండకు జోడీగా సుకుమార్ సినిమాలో ఈమెను ఎంపిక చేశారనేది వార్త. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నేనొక్కడినే సినిమా నిరాశ పర్చినా అందులో నటించిన హీరోయిన్ ను మళ్లీ తన సినిమాలో నటింపజేసేందుకు సుకుమార్ సిద్దం అవ్వడం డేర్ గానే చెప్పుకోవచ్చు. సెంటిమెంట్ గురించి ఆలోచించకుండా సుకుమార్ ఆమెతో వర్క్ కు సిద్దం అవ్వడం సాహసమే అవుతుంది. రౌడీ స్టార్ తో సుక్కు చేయబోతున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.