రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్కు విశేష స్పందన లభించింది. తాజాగా సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ వీడియో ప్రోమోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ పాట లిరికల్ వీడియో ఆకట్టుకోగా, ఇప్పుడు ప్రోమో సాంగ్ మరింత అలరిస్తోంది. ముఖ్యంగా రామ్చరణ్, సమంతల మధ్య సన్నివేశాలు అలరిస్తున్నాయి. సమంత మరోసారి తన హావభావాలతో యువ హృదయాలను పిండేసింది. 1985లో ‘రంగస్థలం’ అనే గ్రామంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు ఏంటి? ఆ గ్రామంలో ఉన్న చిట్టిబాబు ఏం చేశాడు? అన్న నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
‘రంగస్థలం’లో ఆది, అనసూయ, జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరోపక్క బోయపాటి శీను దర్శకత్వంలో రామ్చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో ఎన్టీఆర్తో కలిసి నటిస్తారు.ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాజమౌళి ఇటీవల అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.