కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా హక్కు నిరసనలు జరుగుతున్నాయి అని తెలిసిన విషయమే . అన్ని పార్టీలతో సహా సామాన్యులు కూడా కేంద్రం వైఖరికి నిరసనగా పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. `ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు` అనే నినాదం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన `రంగస్థలం` ప్రీ రిలీజ్ వేడుకకు నిరసనల సెగ తగిలిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఒక హోదా స్థానంలో ఉండి కుడా ఏం మాట్లాడలేరని దీంతో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన చిరు అండ్ కో పై నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న `భరత్ అను నేను` చిత్రం ఆడియో వేడుక వేదికను విశాఖపట్నం నుంచి విజయవాడకు మార్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఏప్రిల్ మొదటి వారంలో ఆ ఆడియో ఫంక్షన్ ను విశాఖలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో గొడవ జరగడం అందులోనూ సినీ నటులు ప్రత్యేక హోదాపై గళం విప్పడంలేదంటూ....టీడీపీ నేతలు విమర్శించడం వంటి పరిణామాలతో వేదికను విజయవాడ-గుంటూరు మధ్యలోకి మార్చారు. మహేష్ బాబుకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా టీడీపీ నేతల విమర్శలతో ఈ రకంగా ప్లాన్ చేశారని టాక్ ఉంది. దానికి తోడు గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీపై పవన్ నిప్పులు చెరగడంతో ఆ పార్టీకి డ్యామేజీ జరిగింది. దీంతో మహేష్ బావ ఎంపీగా ఉన్న గుంటూరు ప్రాంతంలో మహేష్ సందడి చేస్తే....కొద్దిగా టీడీపీకి ప్లస్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఏదో ఒక సందడి జరుగడం వల్ల ప్రభుత్వానికి టీడీపీకి రియల్ ఎస్టేట్ కు లాభం ఉంటుందని ఇలా ప్లాన్ చేశారని భోగట్టా. అదీగాక ఆ సినిమా దర్శకుడు కొరటాల శివకు గుంటూరు విజయవాడల పై మక్కువ ఎక్కువ కావడం ఆయన మిత్రుడు సుధాకర్ ఆ ప్రాంతంలో సినిమాల బయ్యర్ కావడం మరో కారణమని టాక్. ఏది ఏమైనా మరి హోదా నిరసనలు తగలకుండా భరత్ బయటపడతాడో లేదో వేచి చూడాలి.