బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్యన్ ఖాన్ను ఈ కేసు నుంచి తప్పించేందుకు దర్యాప్తు అధికారులు భారీ ప్రయత్నమే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ కేసు విచారిస్తున్న జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే.. షారుక్ ఖాన్ను భారీగా డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న ఎన్సీబీ.. జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై విచారణ చేపట్టింది. డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో సమీర్ వాంఖడేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. కాగా, డ్రగ్స్ కేసు విచారణ నుంచి సమీర్ వాంఖడే నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో అరెస్టై ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న కొడుకు ఆర్యన్ ఖాన్ను షారుక్ ఖాన్ కలిశారు. తనయుడి అరెస్ట్ తర్వాత షారుక్ తొలిసారి బయట కనిపించారు. ఇప్పటికే ఆర్యన్ బెయిల్ పిటిషన్ను మూడుసార్లు తిరస్కరించింది కోర్ట్. డ్రగ్స్ పెడ్లర్స్తో ఆర్యన్కు సంబంధాలున్నాయని, అందుకు ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది ఎన్సీబీ. ఓ హీరోయిన్తో ఆర్యన్ చేసిన చాటింగ్ను కూడా కోర్టు ముందుంచారు. ఆర్యన్కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఎన్సీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆర్యన్కు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడే అవినీతి ఆరోపణలు రావడం మరింత కలకలం సృష్టిస్తోంది. మరి ఈ ఆరోపణలు ఈ కేసును ఇంకెక్కడికి తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే.