అభిమానుల ప్రేమాభిమానాలే తనకు ఆశీస్సులని ప్రముఖ సినీనటి తమన్నా అన్నారు. శనివారం ఆమె కడప జిల్లా ప్రొద్దుటూరులో సందడి చేశారు. ఓ మొబైల్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమన్నాను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తమన్నా విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరుకు తాను మొదటిసారిగా వచ్చానని.. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. అనంతరం షోరూం నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వారిని మరింత ఉత్సాహపరిచారు. ప్రస్తుతం తాను ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నానని, తర్వాత సందీప్ కిషన్తో ఓ సినిమాలో నటించనున్నట్లు చెప్పారు. మొబైల్ షోరూం లక్కీడ్రాలో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.