రవితేజ, శృతిహాసన్ కాంబినేషన్లో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి బలుపు వంటి హిట్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతోంది. మళ్లి వీరిద్దరూ జంటగా చిత్రం రూపొందనుందన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. రవితేజ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో రవితేజ సరసన శ్రుతిహాసన్ను ఎంపిక చేశారని అంటున్నారు. తెలుగులో కాటమరాయుడు తర్వాత ఆమెకు సినిమాలు సన్నగిల్లాయి. ఆ గ్యాప్ తర్వాత ఆమె అంగీకరించిన చిత్రమిదేనని చెబుతున్నారు. ప్రస్తుతం శభాష్నాయుడుతో పాటు బాలీవుడ్లో ఆమె ఓ చిత్రం చేస్తోంది. ఇదిలావుండగా…రవితేజ నటిస్తున్న నేల టిక్కెట్ చిత్రంతో బిజీగా ఉన్నారు. కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 10న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్కల్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని సమాచారం. మే 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.