ప్రస్తుతం బయోపిక్ల సీజన్ నడుస్తోంది. బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోను బయోపిక్ల జోరు నడుస్తుంది. అలనాటి అందాల తార సావిత్రి జీవిత నేపథ్యంలో మహానటి అనే బయోపిక్ తెరకెక్కగా, ఈ చిత్రం నేడు గ్రాండ్గా విడుదలైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వస్తున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ చక్కని నటనా నైపుణ్యం కనబరిచిందని అంటున్నారు. అచ్చం సావిత్రిని ప్రతిబింబించేలా తన లుక్స్తో పాటు హావభావాలతోను అదరగొట్టిందని కీర్తి అభిమానులు అంటున్నారు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ మరో బయోపిక్లో నటించనుందనే వార్త దావానంలా పాకింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ త్వరలోనే తెరకెక్కనుందని కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ మేకర్స్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసుకోగా, జయలలిత పాత్ర కోసం పలువురు నటీమణులని పరిశీలిస్తున్నారట. సావిత్రి పాత్ర పోషించి మెప్పించిన కీర్తి సురేష్ జయలలిత పాత్రలోను నటించగలదని మేకర్స్ భావించి ఈ అమ్మడిని సంప్రదించారట. వెంటనే కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మరి నటిగా, ముఖ్యమంత్రిగా, ప్రజల గుండెలలో కొలువుదీరిన పురుచ్చితలైవిగా వెండితెరపై చూపించడం అంటే పెద్ద సవాలే మరి. ఆ సవాల్ని స్వీకరించి కీర్తి ముందుకు సాగుతుందా లేదా అనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.