అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్గా చెప్పుకొనే కేన్స్ చలనచిత్రోత్సవ వేడుక మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. మే 8 నుండి 19 వరకు జరిగే ఈ వేడుకలో దాదాపు 18 సినిమాలని ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్కి సంబంధించి ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ రెడ్ కార్పెట్పై మెరవనున్నారు. కేన్స్ జ్యూరీ సభ్యురాలైన ఐష్ ప్రముఖ ఫ్రాన్స్ కాస్మెటిక్ బ్రాండ్ లారియల్కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. సోనమ్, కత్రినా కూడా ఈ బ్రాండ్కి అంబాసిడర్గా ఉన్నారు. అయితే ఈ ఏడాది నుండి కేన్స్లో సెల్ఫీలు దిగే ఛాన్స్ ఉండదు. ఈ విషయాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రీమాక్స్ అన్నారు. ఇంతకముందు తారలు రెడ్ కార్పెట్పై హోయలు పోతూ సెల్ఫీలకి స్టిల్స్ ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. కాని ఇక నుండి ఆ ఛాన్స్ ఉండదు. ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ రివీరా నదీ తీరాన మే 8 నుంచి మే 19 వరకు జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు సంబంధించి కొత్త ప్రొటొకాల్స్ జారీ అయ్యాయి. ఈ ప్రొటోకాల్స్లో ప్రెస్ వారి కోసం నిర్వహించే మార్నింగ్ స్క్రీనింగ్లను తీసేశారు. అందరు కూడా సాయంత్రం సమయంలోనే సినిమా చూడాలని అంటున్నారు. ముందుగా షోస్ చూడడం వలన మీడియా ప్రతినిధులు సమీక్షలు రాసి సినిమాల మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని నాశనం చేస్తున్నారని నిర్వాహకులు మండిపడ్డారు. నెట్ఫ్లిక్స్ సినిమాలను కూడా కేన్స్లో నిషేధించారు. 71వ చలన చిత్ర వేడుకకి సంబంధించి మేం తీసుకున్న ఈ నిబంధనలని పాటించేట్లయితేనే కేన్స్కి రండి అంటూ కేన్స్ ఫెస్టివల్ డైరెక్టర్ థీర్రీ ఫ్రెమో ప్రకటించారు. నిన్న సాయంత్రం జరిగిన వేడుకలలో రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న అస్గర్ ఫర్హదీతో పాటు జావెర్ బార్డెమ్, పెనిలోప్ క్రూజ్, రికార్డో డ్రియాన్ తదితరులు ఎర్రతివాచీపై నడిచారు.