హీరోలను లాంఛ్ చేయడంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ది అందె వేసిన చేయి అంటారు. మాస్ హీరో ఇమేజ్ ను అనతి కాలంలో అందుకునే స్థాయిలో సినిమాలు తీయడంలో.. పూరీ దిట్ట. అంతెందుకు.. రామ్ చరణ్ లాంఛింగ్ ను కూడా పూర్తి చేసిన వాడు పూరీనే. అయితే.. పూరీ పరిచయం చేసిన హీరోల కంటే.. హీరోయిన్లు ఎక్కువగా షైన్ అవుతుంటారు.పూరి పరిచయం చేసిన కొత్త భామల్లో చాలా మంది టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. రేణు దేశాయ్.. అమీషా పటేల్.. రక్షిత.. అసిన్.. తనూ రాయ్.. హన్సిక.. నేహా శర్మ.. సంజన.. అదాశర్మ.. ఇలా చాలామందే ఉన్నారు. వీళ్ళలో కొందరు స్టార్లు అయ్యారు. మరి కొందరు ఫ్లాపుల కారణంగా.. తమ కెరియర్ ను డిజాస్టర్ చేసుకున్నారు. రీసెంట్ గా అయితే లోఫర్ లో నటించిన దిశా పాట్నీని కూడా పూరీనే పట్టుకొచ్చాడు. ఈమె బాలీవుడ్ లో అగ్రస్థానాన్ని టార్గెట్ చేసేసింది. ఇప్పుడు కొత్త కన్నడ పిల్ల నేహా శెట్టిని 'మెహబూబా'తో పరిచయం చేస్తున్నాడు పూరీ జగన్నాధ్. ఇప్పుడు ఈమె సంగతి ఏమవుతుంది అన్నదే ప్రశ్న.
ఇప్పటివరకూ విడుదల చేసిన అంతంతమాత్రం ప్రమోషన్ కంటెంట్ లో.. ఉన్నంతలో హీరోకే ఇంపార్టెన్స్ కనిపిస్తోంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి కూడా బాగానే ఇంపార్టెన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో తీసిన సినిమాల మాదిరిగా కాకుండా.. మొదటిసారిగా కథను నమ్మి మెహబూబా చేశానంటూ పూరీ చెబుతున్నాడు. మరి టాలీవుడ్ లో రాణించాలన్న నేహా శెట్టి ఊహలు ఎక్కడికి చేరతాయో? ఎంత మాత్రం నెరవేరతాయో? మరికొన్ని గంటల్లో ఈమె జాతకం బయటపడుతుంది. వెయిట్ అండ్ సి.