లావణ్య త్రిపాఠికి ఎట్టకేలకు ఓ అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లు తెలిసింది. అందంతో పాటు మంచి అభినయాన్ని ప్రదర్శించగల నటిగా పేరు తెచ్చుకున్న ఆమెకు చాలాకాలంగా అపజయాలే పలకరిస్తున్నాయి. మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఇంటిలిజెంట్ వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద అనుకున్నంతగా ఆడకపోవడం ఆమెకు నిరాశను కలిగించింది. దాంతో అప్పటివరకు ఆమెను వెదుక్కుంటూ వచ్చిన అవకాశాలు కాస్తా తగ్గిపోయాయి. ఇంటిలిజెంట్ తర్వాత ఆమెకు నూతన చిత్రమేదీ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఏమౌతుందోనని ఆందోళన చెందిన ఆమెకు తాజాగా ఓ చిత్రంలో అవకాశం తలుపు తట్టినట్లు పరిశ్రమలో చెబుతున్నారు. మంచి హిట్లతో జోరుమీదున్న హీరో నిఖిల్ నటించబోయే చిత్రంలో లావణ్యను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. కిర్రాక్పార్టీ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నిఖిల్ మరో రీమేక్ చిత్రం చేయబోతున్నారు. తమిళంలో విజయం సాధించిన కణితన్ చిత్రాన్ని తెలుగులో పునర్నర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో నిఖిల్ సరసన లావణ్య ఎంపికైందని అంటున్నారు. ఇందులోని పాత్రకు లావణ్య అయితే అన్నివిధాలా బావుంటుందని చిత్రబృందం భావించిందట. అందులో భాగంగా దర్శకుడు సంతోష్ కథతో పాటు పాత్ర గురించి చెప్పడంతో వెంటనే ఆమె అంగీకరించినట్లు చెబుతున్నారు. ఆ మేరకు ఆమె హైదరాబాద్కు వచ్చి షూటింగ్లో పాల్గొంటారని, ఇదే ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.