త్వరలో యుద్ధ విద్యలు నేర్చుకునేందుకు సిద్ధమవుతోంది యామీ గౌతమ్. వికీ డోనర్ చిత్రంతో బాలీవుడ్కు పరిచయమైన ఈ తార…బద్లాపూర్, కాబిల్ చిత్రాలతో బాగా పేరు తెచ్చుకుంది. దక్కిన గుర్తింపునకు సంతోషంగానే ఉన్నా…సాధించాల్సింది ఇంకా ఉందంటోంది యామి. తనకు నటిగా చాలా కోర్కెలు ఉన్నాయని, వాటి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తన నట ప్రయాణం స్లో అండ్ స్టడీగా సాగుతున్నట్లు చెప్పింది. భారత్ సరిహద్దులో పాక్ ఉగ్రవాదులు జరిపిన యూరీ దాడుల నేపథ్యంలో యురీ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఇంటిలిజెన్స్ అధికారిణి పాత్రలో యామీ నటిస్తోంది. ఈ పాత్ర కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎంఎంఏ నేర్చుకుంటోంది. పాత్ర పోషణకు ఈ యుద్ధ విద్యలు అవసరమని దర్శకుడు చెప్పగానే రంగంలోకి దిగిందీ సుందరి. ఈ సుందరి మాటల్లో వింటే…వారసత్వం లేకుండా బాలీవుడ్లో అడుగుపెట్టడం చాలా కష్టం. నేనది సాధించాను. కొన్ని మంచి చిత్రాల్లో భాగమయ్యాను. విజయాలు దక్కాయి. యురీ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం రావడం చాలా సంతృప్తిగా ఉంది. ఈ చిత్రంలో ఇంటిలిజెన్స్ అధికారిణిగా నటిస్తున్నాను. అందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను. అని చెప్పింది.