‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. తొలి చిత్రంలో ఎంతో ఈజ్తో నటించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వచ్చిన ‘పోకిరి’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకుని లక్కీ గర్ల్ అనిపించుకుంది. ఆ తరువాత.. అనతి కాలంలోనే తెలుగులో యంగ్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇక సీనియర్ హీరో రవితేజతో అయితే అత్యధికంగా మూడు సినిమాల్లో (‘ఖతర్నాక్’, ‘కిక్’, ‘దేవుడు చేసిన మనుషులు’) నటించింది. అయితే.. బాలీవుడ్లో వరుస ఆఫర్లు రావడం వల్ల తెలుగు సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఇవ్వడానికి ఈ గోవా భామ రెడీ అవుతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించాల్సి ఉంది. కాగా.. కొన్ని కారణాల వలన ఈమె స్థానంలో ఇప్పుడు ఇలియానా నటించనుంది. నిర్మాతలు భారీ పారితోషికం ఇవ్వడంతో పాటు.. రవితేజతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా ఇల్లి బేబీ ఈ సినిమాని ఒప్పుకుందని సమాచారం. ఏది ఏమైనా తెలుగులో ఈమె నటించిన ఆఖరి సినిమా (‘దేవుడు చేసిన మనుషులు), ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత చేస్తున్న రీ-ఎంట్రీ ఫిల్మ్ (‘అమర్ అక్బర్ ఆంటోనీ’) రెండూ కూడా రవితేజ చిత్రాలే కావడం గమనార్హం. అన్నట్టు.. ఇదే చిత్రంలో శ్రుతి హాసన్ కూడా మరో హీరోయిన్గా నటించనుందని తెలిసింది.