'ప్రేమమ్' వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'సవ్యసాచి'. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం 'అల్లరి అల్లుడు'లోని పాపులర్ సాంగ్ 'నిన్ను రోడ్డు మీద చూసినాది' పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని వార్తలు వచ్చినప్పటికీ.. రకుల్ ఆ కథనాలను కొట్టిపారేసింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రత్యేక గీతంలో మిల్కీ బ్యూటీ తమన్నా నర్తించే అవకాశముందని తెలిసింది. ఇదివరకు చైతు, తమన్నా '100% లవ్', 'తడాఖా' చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. మొదటి సారి చైతుతో తమన్నా చేసే ప్రత్యేక గీతమిదే అవుతుంది. అంతేగాకుండా.. ఒరిజనల్ సాంగ్ చేసిన నాగార్జున, రమ్యకృష్ణ కూడా ఈ పాటలో తళుక్కున మెరిసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకోబోయే ఈ పాటకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. కాగా.. జూలై నెలలో 'సవ్యసాచి' తెరపైకి రానుంది.