బాలీవుడ్ నటి, తెలుగులో ‘తుఫాన్’ చిత్రంలో నటించిన ప్రియాంకా చోప్రా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో విడుదల కానున్న హిందీ సినిమా ‘భారత్’లో ప్రియాంక కీలకపాత్ర పోషించారు. ఇటీవల ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అనుభవాలను వెల్లడించారు. ‘నేను 15 ఏళ్ల క్రితం బాలీవుడ్లో కాలుమోపాను. అయితే ఇండస్ట్రీలోని ప్రతీవారికీ ‘అంకుల్’ ఉంటారు. లేదా ఎవరి సంతానమో అయి ఉంటారు. అస్సలు ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేనివారు ప్రొడక్షన్ హౌస్లోకి ప్రవేశించడం చాలా కష్టం. అయితే నాకు మిస్ వరల్డ్ కిరీటం లభించాక బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. అయితే కెరియర్ ప్రారంభంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో నాకు బాలీవుడ్లో ఎవరూ తెలియదు. ఎవరిని చూసినా వారు ఎవరికో ఒకరికి బంధువైవుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానం సంపాదించుకోవడం కష్టమైంది. మొదట్లో అవకాశాలు వచ్చినప్పటికీ, నన్ను ప్రాజెక్టు నుంచి ఎప్పుడు తప్పిస్తారోనని భయపడేదానిని’ అని తెలిపింది.