బిగ్బాస్ తెలుగు సీజన్ 2 ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతున్నది. సీజన్ 2లో మొదటి ఎలిమినేటర్గా సంజనా హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయింది. దీంతో హౌజ్మేట్స్ మొత్తం 15 మందిగా మిగిలారు. అయితే.. ఆదివారం ఎపిసోడ్లో నాని ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన వార్త అందించాడు. మరో నటి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. నిజానికి ఆ నటి గత వారమే హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల తను ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నట్లు నాని ప్రకటించాడు.ఇంతకీ ఆ నటి ఎవరనేగా మీ సందేహం. మోసగాళ్లకు మోసగాడు, గ్రహణం, మాయ, లాగిన్, క్షత్రీయ ది ఫైటర్ లాంటి సినిమాలో నటించి అలరించిన నందినీ రాయ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తనను ప్రేక్షకులకు పరిచయం చేసిన నాని.. నందినీని ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. నందినీ స్టేజి మీదకు రాగానే తన ఏవీని ప్రేక్షకుల కోసం ప్రదర్శించాడు. తర్వాత తనతో కాసేపు ముచ్చటించి ఆదివారం ఎపిసోడ్ను ముగించాడు.