తొలి చిత్రం(భరత్ అనే నేను)తోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ. ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలకు ముందే రెండో ప్రాజెక్ట్కు సంతకం చేసేశారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో కైరా.. రామ్చరణ్కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.అయితే కైరాకు ఈరోజు షూటింగ్ లేదట. దాంతో హైదరాబాద్ అంతా తిరగాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈరోజు నాకు హాలీడే . కాబట్టి హైదరాబాద్లో నేను చూడాల్సిన చక్కని ప్రదేశాలు ఏమన్నా ఉంటే చెప్తారా?’ అని నెటిజన్లను కోరారు. దానికి నెటిజన్లు విభిన్నమైన ఐడియాలు ఇస్తున్నారు.
కైరా ట్వీట్కు నెటిజన్ల సరదా స్పందనలు:
‘ఎండలకి ఏం తిరుగుతావ్ డార్లింగ్. రూంకి వెళ్లి ఫ్యాన్ వేసుకుని నిద్రపో’
‘ ‘సమ్మోహనం’ సినిమా చూడ్డానికి వెళ్లండి’
‘మహేశ్బాబు ఇల్లు చూసి రండి’
‘చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకోండి’
‘మా ఇంటికి రండి. విందు ఏర్పాటుచేస్తా’ అంటూ సరదాగా క్యాప్షన్లు ఇస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే ప్రస్తుతం రామ్చరణ్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ స్థాయి పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. 60 మంది నటులు, 500 మంది బాడీ బిల్డర్లతో ఈ పోరాట ఘట్టాలను రూ.5 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. రామ్చరణ్ని కొత్త రకమైన యాక్షన్ ఘట్టంలో చూపించడంలో భాగంగానే ఈ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.