మెగా స్టార్ చిరంజీవి దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వగా , ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక 151 వ చిత్రం కోసం అభిమానులు కొన్నాళ్ళుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసినప్పటికి, ఈ మూవీ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అభిమానులు వేయికళ్ళతో ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ రోజు కొణిదెల ప్రొడక్షన్ ఆఫీసులో చిరు 151వ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ , అల్లు అరవింద్, పరచూరి బ్రదర్స్, సురేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిత్ర లోగోని విడుదల చేయనున్నట్టు సమాచారం. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ చిరు 151వ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా అధిక భాగం షూటింగ్ ఉత్తర భారత దేశంలో చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో మేకర్స్ ఓ క్లారిటీ రాకపోయినప్పటికి ఐశ్వర్యరాయ్, అనుష్క, నయనతార లలో ఒకరిని తీసుకుంటారనే ప్రచారం మాత్రం జరుగుతుంది. ఇక బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నాడని వార్తలు వచ్చాయి. ఈగ చిత్రంలో విలన్ గా నటించిన కిచ్చా సుదీప్ కూడా చిరు 151వ చిత్రంలో కీలక పాత్ర చేయబోతున్నాడని అంటున్నారు . ఆ మధ్య ఉపేంద్రని కూడా ఈ సినిమాకి సెలక్ట్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మహవీర అనే టైటిల్ ని ఈ మూవీకి పరిశీలిస్తున్నారు.