ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొన్ని విషయాల మీద స్పందించకపోవటమే చక్కటి స్పందన: రెజీనా

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 09, 2018, 03:07 PM




ఆ మధ్య ఒక వెలుగు వెలిగిన రెజీనా ఈ మధ్యన సినిమాల్లో బొత్తిగా కనిపించని పరిస్థితి. వెండితెర మీద తళుక్కున మెరిసి చాలా కాలమైన ఆమె.. ఊహించని రీతిలో ఆమె పేరు అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారంతో ముడిపెడుతూ వార్తలు వచ్చాయి. అయితే.. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ వెల్లడి కాలేదు.


తన పేరును ఇలా లింక్ చేయటంపై రెజీనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే.. ఆగ్రహంతో అరిచేస్తే మరింత డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఒక ఛానల్ ప్రతినిధి రెజీనాను ప్రశ్నించినప్పుడు ఆమెచాలా కూల్ గా స్పందిస్తూ.. మీడియాపై తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


కోపం అన్నది కనిపించకుండా కూల్ గా వ్యవహరిస్తూ.. రిక్వెస్ట్ పేరుతో మీడియా ప్రతినిధులు ఎలా వ్యవహరించాలంటే అంటూ ఆమె చెప్పాల్సిన మాటల్నిచెప్పారు. కొన్నిసార్లు కొన్ని విషయాల మీద స్పందించకపోవటమే చక్కటి స్పందనగా అభివర్ణించిన ఆమె.. ప్రచారం జరిగిన దాన్లో నిజం ఉంటే స్పందించొచ్చు కానీ అందులో నిజం లేనప్పుడు స్పందించటంలో అర్థం లేదన్నారు.


ప్రచారం చేసుకోవటానికి రియాక్ట్ కావటం.. మళ్లీ దానిపై ఎవరో ఒకరు స్పందించటం.. ఇలా పోతే సొల్యూషన్ ఏముంటుందని ప్రశ్నించారు. చుట్టూ ఉన్న ప్రజలు ఏదో ఒకటి మాట్లాడటాన్ని తాను అర్థం చేసుకోగలనని.. కానీ మీడియా ప్రతినిధులు మాత్రం కాస్త ఆలోచించి మాట్లాడాలన్నారు. జర్నలిస్టులను తాను కోరేది ఒక్కటేనని.. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలన్నారు.


ఛానల్ ప్రతినిధిగా జర్నలిస్టు మాట్లాడే విషయాల్ని నమ్ముతారన్నారు. అందుకే.. తాను మరోసారి రిక్వెస్ట్ చేసేదేమంటే.. మాట్లాడే ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యతగా మాట్లాడాలని.. జర్నలిస్టులు చెప్పేదాన్లో నిజం ఉండాలన్నారు. ఇండస్ట్రీ మీద జరిగే ప్రచారాన్ని కొట్టిపారేశారు. 


తనకున్న అనుభవంతో ఇండస్ట్రీ చెడ్డదని తాను చెప్పనన్నారు. ఇలాంటి మాటల కారణంగా చాలామంది మైండ్ సెట్స్ ప్రభావితం అవుతాయన్నారు. ఇలాంటి ప్రచారాల కారణంగా ఇండస్ట్రీ అంటే భయం ఉండొచ్చని.. కానీ.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్పొరేట్ ఉద్యోగంలోనూ ఇలాంటివి ఉంటాయని.. అయితే కెమేరాల ముందు ఉండటంతో ఈజీగా టార్గెట్స్ అవుతున్నట్లుగా వ్యాఖ్యానించారు.


ఏదైనా విషయం మీద వెంటనే రియాక్ట్ అయితే స్పందన వెంటనే వస్తుందని.. అందుకే ఆచితూచి మాట్లాడటం అవసరమన్నారు. చివరగా మీడియా ప్రతినిధులకు తాను చెప్పేదేమంటే.. కెమేరాల ముందు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు రెజీనా. మొత్తానికి జాగ్రత్త.. జాగ్రత్త అంటూనే భారీగానే క్లాస్ పీకారుగా? 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com