యువతను ఆకట్టుకుంటున్న ఆర్ఎక్స్ 100 ఆశించిన విజయాన్ని సాధించింది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని కేంద్రాల నుంచి సానుకూల స్పందన రాబడుతోంది. కేసీడబ్ల్యూ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మించగా…అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా నటించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ…ఏడాది క్రితం కథతో సినిమా ప్రారంభించాం. ఇవాళ సినిమా విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ప్రయాణమంతా అద్భుతంగా సాగింది. తెలుగు రాష్ట్రాల్లో 175 థియేటర్లతో పాటు విదేశాల్లో 300 స్క్రీన్లలో విడుదల చేశాం. అన్ని చోట్ల నుంచి స్పందన బాగుంది. నిన్నటి వర్షాలకు ప్రేక్షకులు థియేటర్లకు రారని భయపడ్డాం కానీ తొలిరోజే 2 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది మా సినిమా. దర్శకుడిని నమ్మి సినిమా నిర్మించాం. పెద్ద విజయాన్ని సాధించింది. అన్నారు.
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ…సినిమా మీద ప్రేమతో పరిశ్రమకు వచ్చాను. ఊరు వదిలి వచ్చి కొన్నేళ్లవుతోంది. అమ్మా నాన్నలకు దూరంగా ఇక్కడే సినిమా కోసం పనిచేశాను. కోట్ల రూపాయలు ఇచ్చినా తిరిగి పొందలేని సమయాన్ని కోల్పోయాను. కానీ ఈ విజయం ఆ బాధలన్నింటినీ మరిపిస్తోంది. మా చిత్రాన్ని యువత బాగా చూస్తున్నారు. కానీ కుటుంబ ప్రేక్షకులు చూస్తే మరింత సంతోషిస్తాను. అప్పుడే మా సినిమా నిజమైన విజయం సాధించినట్లు భావిస్తాను.అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకా నాయికలు కార్తికేయ, పాయల్ రాజ్పుత్, నటులు రావు రమేష్, పంపిణీదారులు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.