హైదరాబాద్: సిసింద్రీగా మురిపించి, మనంలో మెరిసి, అఖిల్తో అలరించారు అక్కినేని నట వారసుడు అఖిల్. ఆయన కథానాయకుడిగా విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో లీకైంది. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. `ఇప్పుడు ఇది లీకైతే ఏమైంది. ఇదిగో ఒరిజినల్. దీని కన్నా పెద్దది, మెరుగైంది ఆగస్టు 21న విడుదల చేస్తాం. ఇందుకు సంబంధించిన క్లూస్ రేపు మీకిస్తా ఫ్రెండ్స్ ` అంటూ ట్వీట్ చేశారు. నాగార్జున అభిమానులతో పంచుకున్న చిత్రంలో అఖిల్ ఒకపక్క ఫైట్ చేస్తూ, మరోపక్క రొమాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇక దీనిపై అఖిల్ మరో విధంగా స్పందించారు. `ఎప్పుడు ఎలా లీకైందో తెలియదు. మీ నుంచి మేమేమీ దాచలేం. నమ్మండి. ఇంతకన్నా పెద్దది, మెరుగైంది ఆగస్టు 21న వస్తుంది. సిద్ధంగా ఉండండి` అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శిని నటిస్తున్నట్లు సమాచారం. `ఎక్కడ ఎక్కడ ఉందో తారక` అనే టైటిల్ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.