రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న సాహో ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొంత టాకీ పార్ట్ షూట్ చేసిన దర్శకుడు సుజిత్ మిగిలిన భాగాన్ని హైదరాబాద్ లో మొదలుపెట్టబోతున్నాడు. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకున్న సాహో టీమ్ వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ తో యాక్టివ్ గా మారబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న సాహో విడుదల విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. వచ్చే సమ్మర్ అంటున్నారు కానీ ఖచ్చితంగా ఫలానా డేట్ అనే అంచనాకు మాత్రం రాలేకపోతున్నారు. డార్లింగ్ ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న అంశం ఇదే. బాహుబలి తరహాలో ప్రభాస్ ప్రతి సినిమాకు ఇలా ఏళ్లకేళ్లు ఎదురు చూడలేమని వాపోతున్నారు. అయినా ఇక్కడ ప్రభాస్ ని అనడానికి కూడా లేదు - సబ్జెక్టుతో పాటు బడ్జెట్ కూడా డార్లింగ్ టైంని తినేస్తున్నాయి.