సమాజంలో అందంగా ఉన్న ఆడవాళ్లపైనే అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ నటి మమతా మోహన్ దాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ‘యమదొంగ’, ‘కేడీ’, ‘కింగ్’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మమత.. కొంత కాలం క్యాన్సర్తో బాధపడ్డారు. దాంతో ఆమె సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తున్న మమత ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సినీ జర్నీతో పాటు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అయితే ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై మమత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమయ్యాయి. ఇంతకీ ఆమె ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..
‘ఎక్కువగా అందంగా ఉండే అమ్మాయిలపైనే అఘాయిత్యాలు జరుగుతుంటాయి. అందంగా ఉన్న అమ్మాయి సమాజంలో ధైర్యంగా బతకడం కష్టం. అందంగా ఉండని ఆడవారి జీవితాలు సంతోషంగానే ఉంటాయి. వారు ప్రేమ, వృత్తి విషయాల్లో బాగానే రాణిస్తారు. ఓ మహిళకు సమస్య ఎదురైతే అందుకు బాధ్యత ఆమెదే. ఎందుకంటే.. ఒక మహిళతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే... తన పట్ల అలా చేసేలా మహిళే ప్రేరేపించి ఉంటుందన్నది నా అభిప్రాయం. ఇది ప్రతి మహిళ జీవితంలో జరుగుతుందని నేను చెప్పడంలేదు. ఇప్పటికీ కొందరు మహిళలకు వారి హద్దులు తెలియవు. ఆడవారికి అభద్రతాభావం ఎక్కువ. ఎవరైనా కామెంట్స్ చేస్తే రెచ్చగొట్టినట్లుగా ఫీలవుతారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ప్రతీసారి మనం స్పందిస్తే సమస్యల్లో చిక్కుకుంటాం’ అని వ్యాఖ్యానించారు.
మమత వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ అమ్మాయి అయివుండి ఇతర ఆడపిల్లల గురించి ఇలా వ్యాఖ్యానించడం తప్పు అంటూ విమర్శిస్తున్నారు.