ఒకప్పుడు టాప్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగిన రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ ను వివాహం చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్పురి చిత్రాల్లో నటించిన రంభ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైంది. అయితే 2016 లో తన భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కింది రంభ. తన పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50లక్షలు చెల్లించాలని కోర్టును కోరింది. అయితే కొంత కాలంగా ఈ కేసుపై సుదీర్ఘ చర్చ జరిపిన కోర్టు ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు రావాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో రంభ, ఆమె భర్త మాట్లాడుకొని, కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని రంభ కోర్టుకు తెలపడంతో జడ్జి విడాకుల కేసును మూసివేస్తున్నట్లుగా ఆ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి హ్యాపీగా ఉంటున్న రంభ త్వరలో మరో బేబీకి జన్మనివ్వబోతున్నారు. రంభకి ప్రస్తుతం లాన్య(7), శాషా(3) అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా, త్వరలో వారింట మరో బేబి అడుగుపెట్టనుంది. అయితే సోమవారం రంభ శ్రీమంతం ఘనంగా జరిపారు వారి కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషంగా ఉన్న రంభ తన బంధువులతో కలిసి స్టెప్పులు వేసింది. రంభ భర్త ఆమెపై పూల వర్షం కురిపించారు. రంభ తన ఇన్స్టాగ్రామ్లో శ్రీమంతంకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.