ప్రస్తుతం తెలుగులో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తనదైన నటన, డైలాగ్ డెలివరీతో విజయ్ యువతకు బాగా దగ్గరైపోయాడు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్కు స్టార్డమ్ వచ్చి పడింది. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో ఆసక్తి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ‘గీత గోవిందం’ విషయంలో ఇదే జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు (ఆగస్టు 15న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చింది.
‘ఇంకేం ఇంకేం కావాలే’ అనే ఒక్క పాటతోనే ‘గీత గోవిందం’ అందరి దృష్టిని ఆకర్షించేసింది. ఇక టీజర్తో అంచనాలు పెరిగిపోయాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఇలా అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో యువత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీకవడం కలంకలం రేపింది. దీంతో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. అయితే ఒకరకంగా దీనివల్ల సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ లీక్ మూలంగా సినిమాకు బజ్ పెరిగిపోయింది.
ఇప్పటికే యూఎస్ ప్రీమియర్లు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కామెడీ అదరిపోయిందని, విజయ్ దేవరకొండ వన్మ్యాన్ షో అని కొనియాడుతున్నారు. విజయ్, రష్మిక కెమెస్ట్రీ బాగా కుదిరిందట. ఒక సాధారణ కథని వీరిద్దరూ హిట్టు బొమ్మగా మార్చేశారని అంటున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ పాజిటివ్ రెస్పాన్స్తో ముందుకెళ్తోంది.