అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘యుద్ధం శరణం’తో కృష్ణ మారిముత్తు అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కృష్ణ నాగచైతన్య చిన్నప్పటి మిత్రుడట. చెన్నైలో వీళ్లిద్దరూ కలిసే చదువుకున్నారట. కృష్ణతో తన అనుబంధం గురించి ‘యుద్ధం శరణం’ ఆడియో వేడుకలో ఆసక్తికర విషయాలు చెప్పాడు చైతూ. తామిద్దరం చిన్నప్పట్నుంచి స్నేహితులమని.. తమ ఇద్దరి పుట్టిన రోజు ఒకటే (నవంబరు 23) అని చైతూ చెప్పాడు. తాను.. కృష్ణ నాలుగో తరగతి నుంచి కలిసి చదువుకున్నామని.. ఎనిమిదో తరగతిలో ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని.. ఆ యుద్ధంలో తానే గెలిచానని.. కానీ ఈ సెప్టెంబరు 8న ‘యుద్ధం శరణం’ సినిమాకు సంబంధించిన యుద్ధం కృష్ణనే తన మీద గెలవాలని కోరుకుంటున్నానని చైతూ చెప్పాడు.
ఇక నిర్మాత సాయి కొర్రపాటి గురించి చైతూ మాట్లాడుతూ.. ఈ సినిమాకు చాలా వరకు కొత్త వాళ్లే పని చేశారని.. ఇందుకు ఏ నిర్మాతా ఒప్పుకోడని.. ఆయన మాత్రమే ఆ ధైర్యం చేశారని.. ఆయన నేతృత్వంలోని వారాహి సంస్థ ఎప్పుడూ కొత్త టాలెంటుని ప్రోత్సహిస్తూ ఉంటుందని.. అలాంటి బేనర్లో పని చేయడం తన అదృష్టమని చైతూ అన్నాడు. తాను కానీ.. ఇతర నటీనటులు కానీ ‘యుద్ధం శరణం’ కోసం డైటింగులు కానీ.. ఇంకే కష్టం కానీ పడలేదని.. అయినప్పటికీ తెరమీద అందంగా కనిపిస్తున్నామంటే అది సినిమాటోగ్రాఫర్ నికేత్ ప్రతిభే అని చైతూ అన్నాడు. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన కార్తికేయ.. తమ ముఖాల్లో ఎప్పుడూ నవ్వు ఉండేలా చూసుకున్నాడని.. అతను చాలా కష్టపడ్డాడని చైతూ చెప్పాడు.