నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో తొలిసారిగా ‘పైసా వసూల్’ కోసం ఒక పాట పాడిన సంగతి తెలిసిందే. మావా ఏక్ పెగ్ లా... అంటూ సాగే ఈ మందు పాట జనాల్లో బాగానే పాపులరైంది. ఈ పాట విషయమై సీనియర్ నటుడు మోహన్ బాబు ‘పైసా వసూల్’ ఆడియో సక్సెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ‘మామా ఏక్ పెగ్ లా..’ అంటూ పాట పాడాడని.. ఐతే అతను ఎవరిని ఉద్దేశించి ఆ పాట పాడాడో తనకు తెలియాలని మోహన్ బాబు అన్నారు. బాలయ్య మావా అంటున్నది ఎవరి గురించా అని తనకు కుతూహలంగా ఉందని చెప్పారు. బాలయ్య బావ చంద్రబాబు అయితే మద్యం ముట్టరని.. తనకు ఆ విషయం తెలుసని.. ఈ విషయం చంద్రబాబును కూడా ఫోన్ చేసి అడుగుదామనుకుంటున్నానని.. మరి బాలయ్య ఎవరిని ‘మావా ఏక్ పెగ్ లా’ అని అడిగాడో తెలియాలని మోహన్ బాబు చమత్కరించారు. ఐతే బాలయ్య ఈ పాట మాత్రం చాలా బాగా పాడాడని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు.
పైసా వసూల్’లోని ఓ పాటలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ డ్యాన్సుల్ని అనుకరించే ప్రయత్నం చేశాడని.. ఐతే ఎన్టీఆర్ లాగా బాలయ్యే కాదు ఎవ్వరూ చేయలేరని.. ఈ సినిమా చూసి బాలయ్య సరిగా చేయలేదని అనిపిస్తే ఫోన్ చేసి బాలయ్యకు ఆ విషయం చెబుతానని మోహన్ బాబు అన్నారు. తనకు తన తల్లిదండ్రులు.. గురువు దాసరి నారాయణరావు ఎలాగో.. ఎన్టీఆర్ అన్నా అంతే అభిమానమని మోహన్ బాబు చెప్పారు. పూరి జగన్నాథ్ తో తాను ‘బుజ్జిగాడు’ సినిమా చేశానని.. అతనంత వేగంగా షూటింగ్ చేసే దర్శకులు చాలా అరుదని.. అతను గొప్ప దర్శకుడని కితాబిచ్చారు మోహన్ బాబు.