తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. హైదరాబాదులో నిర్వహించిన 'రాజు గారి గది-2' సినిమా ట్రైలర్ లాంఛ్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాన్నగారి ప్రతి పుట్టిన రోజున అంటే సెప్టెంబర్ 20న అందరం ఆయన ఇంట్లో కలుస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను నేరుగా అక్కడి నుంచే వస్తున్నా. నాన్న ఇంటికి వెళ్లగానే ఓ ఎనర్జీ, చిరునవ్వు వచ్చేస్తాయి. నాన్నగారు అందరితో అలాగే ఉంటారు'. అని నాగార్జున గుర్తు చేసుకున్నారు. ఎన్ని పనులు ఉన్నా నాన్న పుట్టిన రోజున ఆయన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేసి, ఇతర కార్యక్రమాల్లో మునిగిపోతామని ఆయన తెలిపారు. అనంతరం ట్రైలర్ లాంఛ్ చేశారు.